Sunday, May 9, 2021

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి 

హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి 


మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది 

వీర్యపు  కణమై  కడుపునా  పడుతూ  

నెల  నెల  ఎదిగిన  ఓ  శిశువా.. 

తనువే  తొడిగి  భువిలో  పడుతూ 

తెలియని  పుట్టుక  నీది  కదా 


పూర్వ  జన్మాల  స్మృతిని  మరిచిపోయావు  మానవా 

మాయ  నిన్నవరించి  నడక  నేర్చావు  మెల్లగా ..

పసలేని  అజ్ఞాన  విద్యలే  నేర్చి  గర్వపడతావురా .

ఈ  రక్త మాంసాల  దేహమే  చూసి  మురిసిపోతావురా .


వెనువెంట  వస్తున్నా  మృత్యు  పాశాంన్ని  మరిచిపోబోకురా ..

సాగితే  నీ  సరిలేరుఅని  డాంబికం తెగ  పలకకురా..


పీనుగై  మారిన  క్షణమున  కుక్కతో  సమమవ్వురా ..

ధనమే  సుఖమును  భ్రమలో  పడుతూ .

కనులే  కానక  తిరిగేదవా .

తలకు  మోముకు  రంగులు  వేస్తూ ..

కాలం  కన్నులు  మోసెదవా  ..


పోగు చేసిన  లక్షలు  కోట్లు  నిన్ను  బ్రతికించవురా ..

నువ్వు  పొందిన  ఎన్నో  బిరుదులూ  చావు  తప్పించవురా ..

భార్యా  బిడ్డలు  వెంట  వత్తురని  కలలో  కూడా  తలచకురా ..

వదలక  నీతో  వచ్చినా  ఆ  వల్లకాటి  వరకేరా ..


నిన్ను  మోసిన  పల్లకి  చివరికి  నీ  పాడే  అవుతది  ..

నువ్వు  ఉండిన  గృహమే  చివరకు  నిను వెళ్ళమంటది .

నిను  కాల్చివేయు  కట్టెలుగా 

ఓ  చెట్టుకు  రాసి  ఉంటుంది ..


పరిమళాలు  పులుముకున్న  తనువు 

ఈ  మన్ను  కలవక  తప్పదది ..

పోయే  ముందర  కాలం  పక పక పరిహాసమాడుట  తధ్యమది ..


శవమై తిరిగే  తెరలో  శివమా .

నువ్వు ఎరగని  కదా  నీది  కదా .


నెత్తుటి  మాంసపు  ముద్దగా  ఎదిగిన .

కాయం  కూలుట  ఖాయమురా ..


కాబోయే  శవం  నీవు  కదరా  దేహం  పై  మొహం  వదలరా ..

ఇన్నాళ్లు  సాధించింది  ఏది  రా  , నీకోసం  ఏం  చేసావురా !!!

అన్నమయ్య కీర్తన

 ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||


చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | 
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||

చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | 
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||

చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | 
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||



To listen this as a song, we got wonderful creative tune from Yekam movie and can be visited from the below LInk.

https://www.youtube.com/watch?v=SYiDTN5-lok

Tuesday, February 9, 2021

 నీతి కథ - మాతృభక్తి


బ్రహ్మకు కదృవ, వినుత అను ఇరువురు భార్యలు కలరు. ఒకనాడు కశ్యపుడు సంతోషంతో ఉన్న సమయాన కుదృవ పతిపాదముల చెంగట కూర్చుండి "నాకు వేయిమంది కొడుకులను దయసేయుము " అని కోరెను. వినతయు భర్తను ఆనందపెట్టి "నాకు కడింది వీరులు అగు ఇరువురు కుమారులను అనుగ్రహింపుము " అని ప్రార్థించెను. కశ్యపుడు అందులకు అంగీకరించి వారి కోరికలు తీర్చెను. 

పిమ్మట కద్రువ కు వేయి గుడ్లను, వినుటకు రెండు గుడ్లను పుట్టెను. ఆ సవతులు ఇరువురు ఆ గుడ్లను నేతికుండలయందుంచి అతి భద్రముగా సాకుచుండిరి. అట్లు అయిదువందల సంవత్సరములు గడచిన తర్వాత కద్రువకు వేయి గుడ్లనుండి శేషుడు, వాసుకి, కర్కోటకుడు  మున్నగు వేయి పాములు పుట్టెను. సవతి కి వేయి గుడ్లు పొదిగి తన గుడ్లు అలాగే ఉండటం చూసి వినుత తాళజాలక ఒక గుడ్డు చిడిపెను. వెంటనే కాళ్ళులేని ఒక పురుషుడు దాని నుండి బయటకు వఛ్చి "నా శరీరము పూర్తి కాకముందే నన్ను బయటకు తీసితివి. ఇందులకు ప్రతిఫలంగా నీవు నీసవతికి అయిదువందల యేండ్లు దాసివై ఉండుము. రెండవ గుడ్డును దానికది పగులునంత దనుక యుండనిమ్ము. అందునుండి చాల బలముకలవాడు పుట్టును. అతడు నీ దాసీతానము పోగొట్టును" అని చెప్పి వెంటనే సూర్యునకు సారధిగా వెడలిపోయెను. 

తన తెలివితక్కువ తనముకు విచారించుచు వినత రెండవ గుడ్డును జాగ్రత్తగా కాపాడుకొనసాగేను. ఇది ఇలా ఉండగా ఒకరోజు సాయంకాల సమయమున సవతులిరువురు సముద్ర తీరమునకు వెడలిరి. అచ్చట సంచరించుచూ ఉండిరి. ఒద్దు మీద ఉరకలు వేయుచున్న సముద్రపు కెరటముల మీది నురుగువోలె తెల్లనైనున్న యా గుఱ్ఱమును చూసి కద్రువ ఇలా అన్నది. చెల్లెలా! ఒడలంతయు తెలుపు, తోకమాత్రము కాఱునలుపు. ఆ గుఱ్ఱము యెంత చక్కగా నున్నదో చూడుము అని చెప్పెను. అందులకు వినుత తోక కూడా తెల్లగా ఉండగా నల్లగా ఉన్నదందు వేల? అని మాఱు పలికెను. దాని మీద ఇద్దరికీ వాగ్వాదం జరిగి పందెమువేసుకొని తెల్లగా ఉండగా నేను నీకు దాసిని అగుదును లేనియెడల నీవు దాసివయ్యెదవ అని కద్రువ అడిగెను.వినుత అంగీకరించి రమ్ము దగ్గరకు వెళ్లి చూద్దాం అని వినుత అనగా కద్రువ ఇప్పుడు కాదు పొద్దుగూకుచున్నది. భర్త గారికి పరిచర్య చేయవలదా రేపు చూతము అని చెప్పెను. మంచిది అనుకోని పిదప ఇద్దరు ఇంటికి పోయిరి. 

రాత్రి కద్రువ కుమారులని చేరబిలిచి సంగతి అంతయు దెలిపి "మీరు పోయి దాని తోక నలుపు సేయరేని వినుతకు నేను దాసీనయ్యెదను అనియెను." అది అధర్మము అని ఆడవాండ్రకు మంచి చెడ్డలు తెలియవా అని అట్లు చేయుటకు సమ్మతింప లేదు. అపుడు కద్రువ కోపించి జనమేజయుడు సేయు సర్పయాగమున మీరందరును నాశనమయ్యెదరుగాక అని సెపియించెను. ఈ శాపమునకు భయపడి కర్కోటకుడు నీ ఆజ్ఞ ప్రకారము చేసెదనని తెలిపి తల్లికి విన్నవించుకొనెను. 

మరునాడు ప్రొద్దుననే సవతులిరువురు గుఱ్ఱమును పరీక్షించుటకు సముద్రపు గట్టునకు పోయిరి. అప్పటికప్పుడే కర్కోటకుడు పోయి గుఱ్ఱము తోకను అంటి వ్రేలాడుచుండెను. అల్లంత దూరమునే చూచి వినుత "అక్కా నీవన్నదే నిజము నేను నీదాసినైతిని రమ్ము " అని వెనుదిరిగి వఛ్చి సవతి కి దాస్యము చేయసాగెను. 

అయిదారువందల సంవత్సరముల గడచిన తరువాత వినత రెండవ గుడ్డు చితికి దాని నుండి గరుడుడు పుట్టెను. మంచిరోజులు వచ్చనని వినత ఆనందించెను. కద్రువ తన పిల్లలకు సేవ చేయుచుండుమని గరుడుని నియమించెను. తల్లియు, కొడుకును దాస్యము చేయుచుండిరి. 

ఇట్లు కొన్ని దినములు గడిచెను. ఒకనాడు గరుడుడు "కద్రువ నా సవతి తల్లి. ఆమెకు మేము దాసితనమేలా చేయవలెను ? తన తోడిదానికి-సవతి కి మాయమ్మ నౌకరి చేయుచున్నది. నా కన్నతల్లికి ఈ విపత్తు పోగొట్టలేని జన్మమేల? నేను బ్రతికియుండు ఏమి ప్రయోజనము?" అని యూరడిల్లి సవతితల్లి చెంతకుబోయి "ఏమి తెచ్చి ఇచ్చిన మమ్ము విడిచిపెట్టెదరు" అని అడిగెను. కద్రువ కొడుకులతో నాలోచించి "నీకు శక్తి కలదేని అమృతభాండము తెచ్చి ఇమ్ము" అనియెను. 

తోడనే తల్లిదండ్రుల అనుగ్రహంబున ఆకలి తీర్చుకొని గరుడుడు స్వర్గలోకమునకేగి అమృతభాండము రక్షించుచున్న వారినందరిని సంహరించి దాని చుట్టుయున్న అగ్నిని, సముద్ర జలమును పుక్కిటగొనివచ్చి ఆర్పివేసి లోపల కాపలాగా ఉన్న పాముల్ని జంపి భాండమునెత్తుకొని బయలుదేరెను. ఇంద్రుడు అతనితో బోరాలేక స్నేహముజేసి "నీ ప్రజ్ఞకు మెచ్చితిని. ఏమి కావలయునో కోరుకొనుము" అనియెను. అప్పుడు గరుడుడు నీ రాజ్యములోనున్న పాములను భక్షించుటకు నాకు అనుమతి కావలెననెను. ఇంద్రుడు అందులకు అంగీకరించి అమృతభాండమును నీవు కద్రువులయెదుట నుంచి దాస్యవిముక్తి నుంచి విడుదల అయినపిదప నేను అమృతభాండమును తీసుకొనిపోయెదననెను. గరుడుడు అంగీకరించి అమృతభాండమును కద్రువ యెదుటనుంచి మమ్ములను దాస్యవిముక్తినుంచి తప్పించినట్లేనా అనెను. మీరు అమృతభాండమును అక్కడ ఉంచి నిశ్చింతగా వెళ్ళండి అనెను. 

కద్రువ మరియు తన వేయుగూరు కుమారులు స్నానమాచరించి అమృతము సేవించదలిచిరి. ఇంతలో ఇంద్రుడు అమృతభాండమును తీసికొనిపోయెను. కద్రువ అక్కడ అమృతభాండము లేనిది చూసి బహుదుఃకించిరి. అమృతభాండమున్న ప్రదేశములో ఉన్న దర్భలను నాకిరి, అపుడు ఆ దర్భలు తెగి నాలుక రెండుగా చేయలేను. అందువల్ల పాములకు నాలుకలు రెండుగా మారెను. 

గరుడుడు ఇట్లు కష్టపడి తన తల్లిని దాస్యవిముక్తి రాలిని చేసి రక్షించి ధన్యుడు అయ్యెను. 

                                                                                                            మాతృదేవో భావ !!



Wednesday, November 28, 2018

సమాసము

సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అంటారు.

సమాసాలలోని రకాలు:

అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.
సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము
ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.
అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
నఞ్ తత్పురుష సమాసము: అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము
ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.

ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

ఛందస్సు

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

వేద ఛందస్సు:

వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము మరియు పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.


ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్య శాస్త్రంలోని 15వ అధ్యాయము మరియు బృహత్‌సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.


తెలుగు ఛందస్సు:

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.

గురువులు, లఘువులు:

ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు.

గురువు, లఘువు, విభజించడము:

ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.


కొన్ని నియమాలు:

దీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I
"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు).

గణాలు-రకాలు:

అక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగక్షరాల గణాలు.

ఏకాక్షర గణాలు

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.

U l

ఉదా: శ్రీ ల

రెండక్షరాల గణాలు

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు.


అన్ని గణాలు:


  • ఆది గురువు భ గణము UII
  • మధ్య గురువు జ గణము IUI
  • అంత్య గురువు స గణము IIU
  • సర్వ లఘువులు న గణము III
  • ఆది లఘువు య గణము IUU
  • మధ్య లఘువు ర గణము UIU
  • అంత్య లఘువు త గణము UUI
  • సర్వ గురువులు మ గణము UUU
  • ఇవి మూడక్షరముల గణములు

ఉపగణాలు:


సూర్య గణములు

  1. న = న = III
  2. హ = గల = UI

ఇంద్ర గణములు

  1. నగ = IIIU
  2. సల = IIUI
  3. నల = IIII
  4. భ = UII
  5. ర = UIU
  6. త = UUI

చంద్ర గణములు

  1. భల = UIII
  2. భగరు = UIIU
  3. తల = UUII
  4. తగ = UUIU
  5. మలఘ = UUUI
  6. నలల = IIIII
  7. నగగ = IIIUU
  8. నవ = IIIIU
  9. సహ = IIUUI
  10. సవ = IIUIU
  11. సగగ = IIUUU
  12. నహ = IIIUI
  13. రగురు = UIUU
  14. నల = IIII
పద్య లక్షణాలు:

వృత్తాలు:

గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.


  1. చంపకమాల
  2. ఉత్పలమాల
  3. శార్దూల విక్రీడితము
  4. మత్తేభ విక్రీడితము
  5. తరళం
  6. తరలము
  7. తరలి
  8. మాలిని
  9. మత్తకోకిల
  10. ఇంద్రవజ్రము
  11. ఉపేంద్రవజ్రము
  12. కవిరాజవిరాజితము
  13. తోటకము
  14. పంచచామరము
  15. భుజంగప్రయాతము
  16. మంగళమహశ్రీ
  17. మానిని
  18. మహాస్రగ్ధర
  19. లయగ్రాహి
  20. లయవిభాతి
  21. వనమయూరము
  22. స్రగ్ధర
జాతులు:

జాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.

  1. కందం
  2. ద్విపద
  3. తరువోజ
  4. అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
  5. ఉత్సాహము
ఉప జాతులు:

  1. తేటగీతి
  2. ఆటవెలది
  3. సీసము (పద్యం)
  4. సర్వలఘు సీసము
పలు విధములైన ఛందములు:

  • యధా-ఆర్యా చందము- ప్రథమ తృతీయ పాదములందు ద్వాదశ మాత్రలును ద్వితీయపాదమందు 18 మాత్రలు చతుర్దశపాదమందు 15 మాత్రలను కలిగి యుండు చందమును యద్ధా ఆర్యా చందము అంటారు. ఇందు పూర్వార్ధ సదృశమై ఉత్తరార్ధమునుండి ఉన్నచో అది గీతి ఉత్తరార్ధ సదృశమై పూర్వార్ధముండినచో అది ఉపగీతి అనబడును.ఆర్యాది ఛంధములో 4 మాత్రలు గల 5 గణములుండును. సర్వగురు, అంత్యగురు,మధ్యగురు, ఆదిగురు, చతుర్లఘువులు ఈ భేదములకు వరుసగా కర్ణ, కరతల, పయోధర, వసుచరణ,విష్ఠములని నామములు.
పరిగణితాక్షర సిద్ధమగు చందములను వర్ణిక లందురు.
శిఖరిణి అను ఛంధములో ప్రతిపాదమునందు సమానములైన హ్రస్వదీర్ఘములైన 17 యక్షరములు ఉండును.
  • పుష్పితాగ్ర ఛంధము- దీని ప్రథమ తృతీయ చరణములు సమాన లక్షణములతో 12 అక్షరములు- రెండు నగణములు 1 రగణము 1 యగణముతో ఉండును. ద్వితీయ చతుర్ధ చరణములలో ఒకే లక్షణముతో కూడిన 13 అక్షరములు- 1నగణము 2 జగణములు 1 రగణము 1 గురువు ఉండును.
  • చండవృష్టి ఛంధము- 20 అక్షరములు గల దండమునకు చండవృష్టి ప్రపాతమని పేరు. ఇందు రెండు నగణములు 7 రగణములు ఉన్నాయి.పదాంతమున విరామము.
  • పేరుక్త ఛంధము - ప్రతిపాదమునందును ఒక్కొక్క అక్షరము ఉండును.దీనికి రెండు భేదములు కలవు మొదటిది గురువు అగునది- దీనికి శ్రీ అని పేరు- ఉదా: వి ష్ణుం వందే, రెండవది లఘువు అక్షరముతో అగునది- ఉదా: హరి హర.
  • రత్యుక్త ఛంధము - ప్రతిచరణమునందును 2 అక్షరములు గలవు. ప్రసారముచే దీనికి 4 భేదములు. ప్రధం భేదము స్త్రీ; రెండు గురువులుగల నాల్గుపాదముల ఛంధము స్త్రీ.
  • మధ్య ఛంధము- మూడు అక్షరములు గల ఛంధము. దీనికి 8 చేదములు ఉన్నాయి.మూడు అక్షరములు గురువుగా నున్న మొదటి భేదము పేరు వారి.
  • ప్రతిష్ఠ ఛంధము- 4 అక్షరములు గల ఛంధము.ప్రస్తారమున దీనికి 16 భేదములు ఉన్నాయి.ప్రథమభేదము పేరు కన్య. ఉదా: భాస్వత్క న్యా సైకా ధన్యా. యస్యాః కూలే కృష్ణో ఖేలత్||
  • సుప్రతిష్ఠ ఛంధము- ప్రస్తారమున దీనికి 32 భేదములు ఉన్నాయి. దీని 9 వ భేదముపేరు పంక్తి 1 భగణము 2 గురువులు.
  • గాయత్రి ఛంధము- దీనికి ప్రస్తారమున 64 భేదములు ఉన్నాయి. దీని మొదటి భేదము పేరు విద్యుల్లేఖ- 2 మగణములు 13 వ భేదము పేరు తనుమధ్య-తగనము, యగణము 16 భేదము పేరు శశివదన -నగనము, యగణము 19వ భేదము వసుమతి తగణము, సగణము.
  • అనుష్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 256 భేదములు ఉన్నాయి. దీనిన విద్యున్మాల మాణవకాక్రీడ, చిత్ర పద, హంసరుత, ప్రమాణిక, సమానిక, శ్లోక, భేద ప్రబేధములు ఉన్నాయి. శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 6వ అక్షరము గురువై 5వ అక్షరము లఘువు. ప్రధం, తృతీయ చరణములందును 7 అక్షరము దీర్షముగాను ద్వితీయ,చతుర్ధ చరణములందును హ్రస్వముగాను ఉండును.
  • బృహతి ఛంధము- ప్రస్తారమున దీనికి 512 భేదములు ఉన్నాయి. 251వ భేదము హలముఖి- ర, న, సగణములు. 64 వ భేదము భుజ్మగ శిశుభృతము- 2నగణములు 1మగణము.
  • పంక్తి ఛంధము- ప్రస్తారమున దీనికి 1024 భేదములు ఉన్నాయి. దీనిలో శుద్ధవిరాట్, పణవ, రుక్మవతి, మయూర సారిణి, మత్తా, మనోరమా, హంసీ, ఉపసిత్థా, చంపకమాలా అనేక అవాంతర భేదములు ఉన్నాయి.
  • త్రిస్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 2048 భేదములు ఉన్నాయి.దీనికే అనేకావాంతర భేదములు కలవు - ఇంద్రవ్రజ- 2 తగణములు 1 జగణము 2 గురువులు, ఉపేంద్రవ్రజ-1 జగణము 1 తగణము 1 జగణము 2 గురువులు, ఉపజాతి- ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ కలయిక, దోధక- 3 భగణములు 2 గురువులు, శాలిని రథోద్దత- మ,త గణములు 2 గురువులు, స్వాగత -ర,న,భ గణములు 2 గురువులు- మొదలగు నామములతో ప్రసిద్ధమైనవి.
  • జగతి ఛంధము -ప్రస్తారమున దీనికి 4096 భేదములు ఉన్నాయి. అందులో వంశస్థము- జ,త,జ,ర గణములు పాదాంతరమున యతి, ఇంద్రవంశము-త,త,జ,రగణములు పాదాంతమున యతి, ద్రుత విలంబిత,తోటక, భుజంగ ప్రయూత, స్రగ్విణి, మొదలైనవి ప్రసిధములు.
  • అతి జగతి ఛంధము - ప్రస్తారమున దీనికి 8192 భేదములు ఉన్నాయి. ఇందులో ప్రహర్షిణి-మ,న,జ,రగణములు 1 గురువు 2-10 యక్షరములపై యతి- ప్రసిద్ధమైనది.
  • శక్వరి ఛంధము - ప్రస్తారమున దీనికి 16384 భేదములు ఉన్నాయి.ఇందులో ఒకటి వసంతలతిక- త,భ గణములు 2 జగణములు 2 గురువులు. పాదాంతరమున విరామము.దీనినే కొందరు సింహోన్నత, ఉద్ధరిణి అని కూడా అంటారు.
  • అతిశక్వరి ఛంధము- ప్రస్తారమున దీనికి 32768 భేదములు ఉన్నాయి. చంద్రావర్త- 4 న, 1 సగణము 7-8 అక్షరములపై విరామము, మాలిని-2 న, 1 మ, 2 భగణములు 7-8 అక్షరములపై యతి, చంద్రావర్తకం - 7-8 అక్షరములపై విరామము 6-9 అక్షరములపై విరామము.
  • అష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 65536 భేదములు ఉన్నాయి.ఇందులో వృషభజగ విలసితము- భ,ర 3 న, 1 గురువు 7-9 అక్షరములపై యతి.
  • అత్యష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 131072 భేదములు ఉన్నాయి. ఇందు హరిణి, పృధ్వి, వంశపత్రపతితము, మందాక్రాంత, శిఖరిణి వృతములు ఉన్నాయి.
  • ధృతి ఛంధము- ప్రస్తారమున దీనికి 262144 భేదములు ఉన్నాయి.అందు భేదము కుసుమితాలతావేల్లితము- మ,త,న, 3 య గణములు 5-6-7 అక్షరములపై యతి.
  • విధృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 524288 భేదములు ఉన్నాయి.ఇందలి భేదమే శార్దూల విక్రీడితము- మ,స,జ,స,త,త,గ ములు.12-7 వ అక్షరములపై యతి.
  • కృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 1048576 భేదములు ఉన్నాయి.ప్రతి చరణము నందును 20, 20 అక్షరములు ఉన్నాయి.
  • ప్రకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 2097152 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి స్రగ్ధర-మ,ర,భ,న,య,య,య,గణములు ఏడేసి అక్షరములపై యతి.
  • ఆకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 4194304 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భద్రకము- భ,ర,న,ర,న, గములు 10-12 అక్షరములపై యతి.
  • వికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 8388608 భేదములు ఉన్నాయి. ఇందులో అశ్వలలిత- న,జ,భ,జ,భ ల గములు, మత్తాక్రీడ- మ,మ,త,న,న,న,ల గములు.8-15 అక్షరములపై విరామము.
  • సంకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 16777216 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి తన్వి -భ,త,న,స,భ,భ,న,య గణములు.5-7-12అక్షరములపై విరామము.
  • అతికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 33553432 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రౌంచపదము- భ,మ,స,భ,న,న,న,న గములు.5-8-7 అక్షరములపై విరామము.
  • ఉదాయము ఛంధము-ప్రస్తారమున దీనికి 67108864 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భుజంగ విజృంభితము - 2 మ, 1త, 3 నగణములు, 1ర, 1 స, 1ల, 1 గు 8-11-7 అక్షరములపై విరామము.

తెలుగు వచనములు

తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి. ఏకవచనము మరియు బహువచనము.

ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. వరి, బంగారము, మొదలైనవి.

బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, కందులు, పెసలు, మొదలైనవి.
వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.

సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.

ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము".
ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".
బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది "బహువచనము"

తెలుగు భాషలో ఏకవచనము మరియు బహువచనములు మాత్రమే ఉన్నాయి.

1. ఏకవచనము - ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును - పుస్తకము, బల్ల, రామరావు.
2. బహువచనము - రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము - పుస్తకములు, బల్లలు, పూలు.
3. నిత్య ఏకవచనము - పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి. 
4. నిత్య బహువచనము - ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.

సంధి

తెలుగులో సంధి అనగా :
పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :
పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

అతడిక్కడ

అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)

అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)

అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)

అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)

అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.

రాముడు + అతడు = రాముడతడు అయినది.

సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

మరికొన్ని ఉదాహరణలు:

1.రామ+అయ్య=రామయ్య,   2.మేన+అత్త=మేనత్త.

వర్ణాలబట్టి సంధులు రెండు రకములు:

1.అచ్సంధి, 2.హల్సంధి.

భాషనిబట్టి సంధులు రెండు రకములు:

1.సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.

సంస్కృత సంధులు:

 సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.


  • సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: భాను+ఉదయము=భానూదయము. భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది/ దేవ + ఆలయము = దేవాలయము.


  • గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋలు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము./ దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు. / గుణ+ ఉన్నతుడు = గుణోన్నతుడు.


  • యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - రలు ఆదేశమగున

ఉదా: అతి+అంతము=అత్యంతము.


  • వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔలు పరమగునపుడు ఔ కారమును వచ్చును

ఉదా: ఏక+ఏక=ఏకైక./ అష్ట + ఐశ్వర్యములు = అష్టైశ్వర్యములు.


  • అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.

ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.


  • జస్త్వ సంధి: వర్గ ప్రథమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.

ఉదా: వాక్+ఈశ=వాగీశ.


  • శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.

ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.


  • ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.

ఉదా: తత్+టీక=తట్టీక.


  • ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.

అచ్చు సంధులు :


  • అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు.

ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.


  • యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా: వెల+ఆలు=వెలయాలు.


  • ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు .


  • ఉకార సంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు

ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.


  • ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.

ఉదా: ఏమి+ఏమి=ఏమేమి./ చివర + చివర= చిట్టచివర. కడ + కడ = కట్టకడ

హల్లు సంధులు :


  • గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వలు బహుళముగానగు.

ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె (ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)


  • సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు

ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు


  • పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పుం-పు లగు

ఉదా: సరసము+మాట=సరసపుమాట


  • ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.

ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు/ చిఱు + ఎలుక = చిట్టెలుక, /


  • టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.

ఉదా: పేరు+ఉరము=పేరుటురము/ నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.


  • రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు

ఉదా: పేద+ఆలు=పేదరాలు


  • దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.

ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి


  • నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఉదా: సొగసు+తనము=సొగసుందనము


  • పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.

ఉదా: భయము+పడె=భయపడె


  • త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.

త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.

ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘంనకు హ్రస్వంబగు

ఉదా: అక్కడ = ఆ+కడ; ఇక్కడ 'ఆ' అనునది .త్రికము మరియు 'క' అనునది అసంయుక్త హల్లు. కనుక ద్విరుక్తంబు వచ్చి

ఆ+క్కడ ఐనది. ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు 'ఆ' దీర్ఘం కాస్త హ్రస్వంబై 'అ' అవుతుంది = అక్కడ


  • ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.

ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.


  • బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.

ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.


  • ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.

ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...