Wednesday, November 28, 2018

సమాసము

సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అంటారు.

సమాసాలలోని రకాలు:

అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.
సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము
ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.
అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
నఞ్ తత్పురుష సమాసము: అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము
ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.

ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

ఛందస్సు

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

వేద ఛందస్సు:

వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము మరియు పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.


ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్య శాస్త్రంలోని 15వ అధ్యాయము మరియు బృహత్‌సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.


తెలుగు ఛందస్సు:

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.

గురువులు, లఘువులు:

ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు.

గురువు, లఘువు, విభజించడము:

ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.


కొన్ని నియమాలు:

దీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I
"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు).

గణాలు-రకాలు:

అక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగక్షరాల గణాలు.

ఏకాక్షర గణాలు

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.

U l

ఉదా: శ్రీ ల

రెండక్షరాల గణాలు

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు.


అన్ని గణాలు:


  • ఆది గురువు భ గణము UII
  • మధ్య గురువు జ గణము IUI
  • అంత్య గురువు స గణము IIU
  • సర్వ లఘువులు న గణము III
  • ఆది లఘువు య గణము IUU
  • మధ్య లఘువు ర గణము UIU
  • అంత్య లఘువు త గణము UUI
  • సర్వ గురువులు మ గణము UUU
  • ఇవి మూడక్షరముల గణములు

ఉపగణాలు:


సూర్య గణములు

  1. న = న = III
  2. హ = గల = UI

ఇంద్ర గణములు

  1. నగ = IIIU
  2. సల = IIUI
  3. నల = IIII
  4. భ = UII
  5. ర = UIU
  6. త = UUI

చంద్ర గణములు

  1. భల = UIII
  2. భగరు = UIIU
  3. తల = UUII
  4. తగ = UUIU
  5. మలఘ = UUUI
  6. నలల = IIIII
  7. నగగ = IIIUU
  8. నవ = IIIIU
  9. సహ = IIUUI
  10. సవ = IIUIU
  11. సగగ = IIUUU
  12. నహ = IIIUI
  13. రగురు = UIUU
  14. నల = IIII
పద్య లక్షణాలు:

వృత్తాలు:

గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.


  1. చంపకమాల
  2. ఉత్పలమాల
  3. శార్దూల విక్రీడితము
  4. మత్తేభ విక్రీడితము
  5. తరళం
  6. తరలము
  7. తరలి
  8. మాలిని
  9. మత్తకోకిల
  10. ఇంద్రవజ్రము
  11. ఉపేంద్రవజ్రము
  12. కవిరాజవిరాజితము
  13. తోటకము
  14. పంచచామరము
  15. భుజంగప్రయాతము
  16. మంగళమహశ్రీ
  17. మానిని
  18. మహాస్రగ్ధర
  19. లయగ్రాహి
  20. లయవిభాతి
  21. వనమయూరము
  22. స్రగ్ధర
జాతులు:

జాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.

  1. కందం
  2. ద్విపద
  3. తరువోజ
  4. అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
  5. ఉత్సాహము
ఉప జాతులు:

  1. తేటగీతి
  2. ఆటవెలది
  3. సీసము (పద్యం)
  4. సర్వలఘు సీసము
పలు విధములైన ఛందములు:

  • యధా-ఆర్యా చందము- ప్రథమ తృతీయ పాదములందు ద్వాదశ మాత్రలును ద్వితీయపాదమందు 18 మాత్రలు చతుర్దశపాదమందు 15 మాత్రలను కలిగి యుండు చందమును యద్ధా ఆర్యా చందము అంటారు. ఇందు పూర్వార్ధ సదృశమై ఉత్తరార్ధమునుండి ఉన్నచో అది గీతి ఉత్తరార్ధ సదృశమై పూర్వార్ధముండినచో అది ఉపగీతి అనబడును.ఆర్యాది ఛంధములో 4 మాత్రలు గల 5 గణములుండును. సర్వగురు, అంత్యగురు,మధ్యగురు, ఆదిగురు, చతుర్లఘువులు ఈ భేదములకు వరుసగా కర్ణ, కరతల, పయోధర, వసుచరణ,విష్ఠములని నామములు.
పరిగణితాక్షర సిద్ధమగు చందములను వర్ణిక లందురు.
శిఖరిణి అను ఛంధములో ప్రతిపాదమునందు సమానములైన హ్రస్వదీర్ఘములైన 17 యక్షరములు ఉండును.
  • పుష్పితాగ్ర ఛంధము- దీని ప్రథమ తృతీయ చరణములు సమాన లక్షణములతో 12 అక్షరములు- రెండు నగణములు 1 రగణము 1 యగణముతో ఉండును. ద్వితీయ చతుర్ధ చరణములలో ఒకే లక్షణముతో కూడిన 13 అక్షరములు- 1నగణము 2 జగణములు 1 రగణము 1 గురువు ఉండును.
  • చండవృష్టి ఛంధము- 20 అక్షరములు గల దండమునకు చండవృష్టి ప్రపాతమని పేరు. ఇందు రెండు నగణములు 7 రగణములు ఉన్నాయి.పదాంతమున విరామము.
  • పేరుక్త ఛంధము - ప్రతిపాదమునందును ఒక్కొక్క అక్షరము ఉండును.దీనికి రెండు భేదములు కలవు మొదటిది గురువు అగునది- దీనికి శ్రీ అని పేరు- ఉదా: వి ష్ణుం వందే, రెండవది లఘువు అక్షరముతో అగునది- ఉదా: హరి హర.
  • రత్యుక్త ఛంధము - ప్రతిచరణమునందును 2 అక్షరములు గలవు. ప్రసారముచే దీనికి 4 భేదములు. ప్రధం భేదము స్త్రీ; రెండు గురువులుగల నాల్గుపాదముల ఛంధము స్త్రీ.
  • మధ్య ఛంధము- మూడు అక్షరములు గల ఛంధము. దీనికి 8 చేదములు ఉన్నాయి.మూడు అక్షరములు గురువుగా నున్న మొదటి భేదము పేరు వారి.
  • ప్రతిష్ఠ ఛంధము- 4 అక్షరములు గల ఛంధము.ప్రస్తారమున దీనికి 16 భేదములు ఉన్నాయి.ప్రథమభేదము పేరు కన్య. ఉదా: భాస్వత్క న్యా సైకా ధన్యా. యస్యాః కూలే కృష్ణో ఖేలత్||
  • సుప్రతిష్ఠ ఛంధము- ప్రస్తారమున దీనికి 32 భేదములు ఉన్నాయి. దీని 9 వ భేదముపేరు పంక్తి 1 భగణము 2 గురువులు.
  • గాయత్రి ఛంధము- దీనికి ప్రస్తారమున 64 భేదములు ఉన్నాయి. దీని మొదటి భేదము పేరు విద్యుల్లేఖ- 2 మగణములు 13 వ భేదము పేరు తనుమధ్య-తగనము, యగణము 16 భేదము పేరు శశివదన -నగనము, యగణము 19వ భేదము వసుమతి తగణము, సగణము.
  • అనుష్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 256 భేదములు ఉన్నాయి. దీనిన విద్యున్మాల మాణవకాక్రీడ, చిత్ర పద, హంసరుత, ప్రమాణిక, సమానిక, శ్లోక, భేద ప్రబేధములు ఉన్నాయి. శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 6వ అక్షరము గురువై 5వ అక్షరము లఘువు. ప్రధం, తృతీయ చరణములందును 7 అక్షరము దీర్షముగాను ద్వితీయ,చతుర్ధ చరణములందును హ్రస్వముగాను ఉండును.
  • బృహతి ఛంధము- ప్రస్తారమున దీనికి 512 భేదములు ఉన్నాయి. 251వ భేదము హలముఖి- ర, న, సగణములు. 64 వ భేదము భుజ్మగ శిశుభృతము- 2నగణములు 1మగణము.
  • పంక్తి ఛంధము- ప్రస్తారమున దీనికి 1024 భేదములు ఉన్నాయి. దీనిలో శుద్ధవిరాట్, పణవ, రుక్మవతి, మయూర సారిణి, మత్తా, మనోరమా, హంసీ, ఉపసిత్థా, చంపకమాలా అనేక అవాంతర భేదములు ఉన్నాయి.
  • త్రిస్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 2048 భేదములు ఉన్నాయి.దీనికే అనేకావాంతర భేదములు కలవు - ఇంద్రవ్రజ- 2 తగణములు 1 జగణము 2 గురువులు, ఉపేంద్రవ్రజ-1 జగణము 1 తగణము 1 జగణము 2 గురువులు, ఉపజాతి- ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ కలయిక, దోధక- 3 భగణములు 2 గురువులు, శాలిని రథోద్దత- మ,త గణములు 2 గురువులు, స్వాగత -ర,న,భ గణములు 2 గురువులు- మొదలగు నామములతో ప్రసిద్ధమైనవి.
  • జగతి ఛంధము -ప్రస్తారమున దీనికి 4096 భేదములు ఉన్నాయి. అందులో వంశస్థము- జ,త,జ,ర గణములు పాదాంతరమున యతి, ఇంద్రవంశము-త,త,జ,రగణములు పాదాంతమున యతి, ద్రుత విలంబిత,తోటక, భుజంగ ప్రయూత, స్రగ్విణి, మొదలైనవి ప్రసిధములు.
  • అతి జగతి ఛంధము - ప్రస్తారమున దీనికి 8192 భేదములు ఉన్నాయి. ఇందులో ప్రహర్షిణి-మ,న,జ,రగణములు 1 గురువు 2-10 యక్షరములపై యతి- ప్రసిద్ధమైనది.
  • శక్వరి ఛంధము - ప్రస్తారమున దీనికి 16384 భేదములు ఉన్నాయి.ఇందులో ఒకటి వసంతలతిక- త,భ గణములు 2 జగణములు 2 గురువులు. పాదాంతరమున విరామము.దీనినే కొందరు సింహోన్నత, ఉద్ధరిణి అని కూడా అంటారు.
  • అతిశక్వరి ఛంధము- ప్రస్తారమున దీనికి 32768 భేదములు ఉన్నాయి. చంద్రావర్త- 4 న, 1 సగణము 7-8 అక్షరములపై విరామము, మాలిని-2 న, 1 మ, 2 భగణములు 7-8 అక్షరములపై యతి, చంద్రావర్తకం - 7-8 అక్షరములపై విరామము 6-9 అక్షరములపై విరామము.
  • అష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 65536 భేదములు ఉన్నాయి.ఇందులో వృషభజగ విలసితము- భ,ర 3 న, 1 గురువు 7-9 అక్షరములపై యతి.
  • అత్యష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 131072 భేదములు ఉన్నాయి. ఇందు హరిణి, పృధ్వి, వంశపత్రపతితము, మందాక్రాంత, శిఖరిణి వృతములు ఉన్నాయి.
  • ధృతి ఛంధము- ప్రస్తారమున దీనికి 262144 భేదములు ఉన్నాయి.అందు భేదము కుసుమితాలతావేల్లితము- మ,త,న, 3 య గణములు 5-6-7 అక్షరములపై యతి.
  • విధృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 524288 భేదములు ఉన్నాయి.ఇందలి భేదమే శార్దూల విక్రీడితము- మ,స,జ,స,త,త,గ ములు.12-7 వ అక్షరములపై యతి.
  • కృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 1048576 భేదములు ఉన్నాయి.ప్రతి చరణము నందును 20, 20 అక్షరములు ఉన్నాయి.
  • ప్రకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 2097152 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి స్రగ్ధర-మ,ర,భ,న,య,య,య,గణములు ఏడేసి అక్షరములపై యతి.
  • ఆకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 4194304 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భద్రకము- భ,ర,న,ర,న, గములు 10-12 అక్షరములపై యతి.
  • వికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 8388608 భేదములు ఉన్నాయి. ఇందులో అశ్వలలిత- న,జ,భ,జ,భ ల గములు, మత్తాక్రీడ- మ,మ,త,న,న,న,ల గములు.8-15 అక్షరములపై విరామము.
  • సంకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 16777216 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి తన్వి -భ,త,న,స,భ,భ,న,య గణములు.5-7-12అక్షరములపై విరామము.
  • అతికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 33553432 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రౌంచపదము- భ,మ,స,భ,న,న,న,న గములు.5-8-7 అక్షరములపై విరామము.
  • ఉదాయము ఛంధము-ప్రస్తారమున దీనికి 67108864 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భుజంగ విజృంభితము - 2 మ, 1త, 3 నగణములు, 1ర, 1 స, 1ల, 1 గు 8-11-7 అక్షరములపై విరామము.

తెలుగు వచనములు

తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి. ఏకవచనము మరియు బహువచనము.

ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. వరి, బంగారము, మొదలైనవి.

బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, కందులు, పెసలు, మొదలైనవి.
వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.

సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.

ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము".
ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".
బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది "బహువచనము"

తెలుగు భాషలో ఏకవచనము మరియు బహువచనములు మాత్రమే ఉన్నాయి.

1. ఏకవచనము - ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును - పుస్తకము, బల్ల, రామరావు.
2. బహువచనము - రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము - పుస్తకములు, బల్లలు, పూలు.
3. నిత్య ఏకవచనము - పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి. 
4. నిత్య బహువచనము - ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.

సంధి

తెలుగులో సంధి అనగా :
పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :
పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

అతడిక్కడ

అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)

అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)

అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)

అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)

అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.

రాముడు + అతడు = రాముడతడు అయినది.

సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

మరికొన్ని ఉదాహరణలు:

1.రామ+అయ్య=రామయ్య,   2.మేన+అత్త=మేనత్త.

వర్ణాలబట్టి సంధులు రెండు రకములు:

1.అచ్సంధి, 2.హల్సంధి.

భాషనిబట్టి సంధులు రెండు రకములు:

1.సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.

సంస్కృత సంధులు:

 సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.


  • సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: భాను+ఉదయము=భానూదయము. భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది/ దేవ + ఆలయము = దేవాలయము.


  • గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋలు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము./ దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు. / గుణ+ ఉన్నతుడు = గుణోన్నతుడు.


  • యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - రలు ఆదేశమగున

ఉదా: అతి+అంతము=అత్యంతము.


  • వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔలు పరమగునపుడు ఔ కారమును వచ్చును

ఉదా: ఏక+ఏక=ఏకైక./ అష్ట + ఐశ్వర్యములు = అష్టైశ్వర్యములు.


  • అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.

ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.


  • జస్త్వ సంధి: వర్గ ప్రథమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.

ఉదా: వాక్+ఈశ=వాగీశ.


  • శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.

ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.


  • ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.

ఉదా: తత్+టీక=తట్టీక.


  • ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.

అచ్చు సంధులు :


  • అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు.

ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.


  • యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా: వెల+ఆలు=వెలయాలు.


  • ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు .


  • ఉకార సంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు

ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.


  • ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.

ఉదా: ఏమి+ఏమి=ఏమేమి./ చివర + చివర= చిట్టచివర. కడ + కడ = కట్టకడ

హల్లు సంధులు :


  • గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వలు బహుళముగానగు.

ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె (ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)


  • సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు

ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు


  • పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పుం-పు లగు

ఉదా: సరసము+మాట=సరసపుమాట


  • ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.

ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు/ చిఱు + ఎలుక = చిట్టెలుక, /


  • టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.

ఉదా: పేరు+ఉరము=పేరుటురము/ నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.


  • రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు

ఉదా: పేద+ఆలు=పేదరాలు


  • దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.

ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి


  • నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఉదా: సొగసు+తనము=సొగసుందనము


  • పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.

ఉదా: భయము+పడె=భయపడె


  • త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.

త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.

ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘంనకు హ్రస్వంబగు

ఉదా: అక్కడ = ఆ+కడ; ఇక్కడ 'ఆ' అనునది .త్రికము మరియు 'క' అనునది అసంయుక్త హల్లు. కనుక ద్విరుక్తంబు వచ్చి

ఆ+క్కడ ఐనది. ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు 'ఆ' దీర్ఘం కాస్త హ్రస్వంబై 'అ' అవుతుంది = అక్కడ


  • ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.

ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.


  • బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.

ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.


  • ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.

ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.

తెలుగు పదాలు

పదాలలో రకాలు


తెలుగు భాషలో పదములు నాలుగు రకములు అవి:

  1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
  2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీనినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
  3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
  4. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.

భాషాభాగములు

తెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -

  • నామవాచకము: మానవుల యొక్క పేర్లు, జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరళ నాలుగు విధములు. అవి -
సంజ్ఞావాచకము: రాముడు, గోదావరి.
జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.
గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.
క్రియా నామవాచకము: వంట, నడక, చేత.
  • సర్వనామము: నామవాచకమునకు బదులుగా వాడబడేది. (ఇది పాశ్చాత్యుల నిర్వచనం)
సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము. ఉదా: నీవు, ఆమె, అతడు.

  • విశేషణములు: నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
  • అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
  • క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అంటారు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.
సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఉదా: మధు బడికి వెళ్ళెను.
అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.
అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.

పర్యాయ పదాలు

ఒకే అర్థాన్ని ఇస్తూ, అనేక పదాలు ఒక దానికి వాడటాన్ని పర్యాయ పదం. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు
తరువు = చెట్టు, వృక్షము, మహీరుహము
జలధి = కడలి, అర్ణవము
పర్వం = పబ్బం, పండుగ, వేడుక
శత్రువు = వైరి, రిపు, విరోధి
ఆంజనేయుడు = పవనసుతుడు, మారుతి, హనుమంతుడు
నిజము = సత్యము, నిక్కము
తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
స్త్రీ = వనిత, మహిళ, పడతి


నానార్థములు

పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని నానార్థాలు అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.

  • క్రియ : పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
  • లావు : బలము, సమర్ధత, గొప్పతనము
  • పృథ్వి : భూమి, విరియునది, ఇంగువచెట్టు, సముద్రతీరము
  • బంధం : ముడి, కలయిక, కట్టివేత


విభక్తి

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:

ప్రత్యయాలు
విభక్తి పేరు
డు, ము, వు, లు
ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
ద్వితీయా విభక్తి.
చేతన్, చేన్, తోడన్, తోన్
తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై
చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి
పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
షష్ఠీ విభక్తి.
అందున్, నన్
సప్తమీ విభక్తి
, ఓరీ, ఓయీ, ఓసీ
సంబోధన ప్రథమా విభక్తి



ప్రథమా విభక్తి :

డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి.

పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది. ఉదా: రాముడు, కృష్ణుడు
అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది. ఉదా: వృక్షము, దైవము
ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది. ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు
బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది. ఉదా: రాములు, సీతలు


ద్వితీయా విభక్తి:

నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి

కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'. ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.
కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును. 'ను' కారము గూర్చి యోచించుట యుక్తము. ఇది ఏకవచనమున జ్యంతమగును.బహువచనమున లాంతమగును.ఇందలి ఇకారమును, అకారమును కేవలము సంబధమును బోధించును.తెలుగు వ్యాకరణములలో జడముల ద్వితీయకు బదులు ప్రథమయును, పంచమికి బదులు నువర్ఞాంత మగు ద్వితీయము వాడుచున్నారు.
పంచమి- రాముడు గృహమును వెడలెను.
తృతీయ- కొలను గూలనేసె.
సప్తమి- లంకను గలకలము.
చతుర్ధి- రామునకు నిచ్చె.
పై నాలుగు విభక్తులును, నుప్రత్యయమునను, కు ప్రత్యయమునను గతార్ధము లగు చున్నవి.కావున ప్రాచీన కాలమున ను, కు వర్ణకములే తెలుగున గలవని తెలియుచున్నవి.

తృతీయ విభక్తి:

చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.

  • కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది. క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త. ఉదా: దేవదత్తుని చేత వంటకము వండబడెను.
తృతీయా విభక్తిలోని నువర్ణాంత లోపంబున జేసి చేత, తోడవర్ణకంబులు నిలుచుచున్నవి.వీనిలో చేత శబ్దము చేయి శబ్దముయొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది.అటులనే తోడ శబ్దము తోడు శ్బ్దాముయొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది.

చతుర్ధీ విభక్తి:

కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

  • త్యాగోద్దేశ్యముగా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం. ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కొఱకు+న్ = కొఱకున్. ద్రుతలోపమున కొఱకు అని నిలిచింది.ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది.అటులనే కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.

పంచమీ విభక్తి:

వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది. ఉదా: మిత్రుని వలన ధనంబు గొనియె.
అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది. అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది. ఉదా: రాముని కంటే నన్యుండు దానుష్కుండు లేడు.
నిర్ధారణ పంచమిలో కూడా కంటే ప్రత్యయం వస్తుంది. ఉదా: మానహాని కంటే మరణము మేలు: ఇక్కడ 'మానహాని' నిర్ధారణము
'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి. ఉదా: జ్ఞానము బట్టి ముక్తుడగు. ముక్తుడవడానికి కారణము జ్ఞానము
వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటే అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.


షష్ఠీ విభక్తి: 

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది. ఉదా: నా యొక్క మిత్రుడు; వాని యొక్క తమ్ముడు.
నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది. జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు. ఉదా: మనుష్యుల లోపల క్షత్రియుండు శూరుండు.
షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును.ఈ ధాతువునకు అరవమున స్వతంత్ర ప్రయోగము ఉంది. అరవమున ఈ ధాతువునకు 'కూడిన, చేరిన, ఒప్పిన' అని అర్ధము ఉంది. లోపల- ఇది ఒక్క శబ్దము.ఇది నిర్ధారణ షష్ఠి యందు వచ్చుచున్నది.దీని అర్ధమును బట్టి ఇది సప్తమి రూపమనియే చెప్పుచున్నారు. కాని సంస్కృతమున నిర్ధారణమున షష్ఠి ప్రయోగింపబడును.కావున, సామ్యమున ఇది వైయ్యాకరణలుచే ప్రవేశపెట్టినట్లుగా తోచుచున్నది.


సప్తమీ విభక్తి:

అందున్, నన్--- సప్తమీ విభక్తి.

అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.
ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం. ఉదా: ఘటమందు జలం ఉంది.
వైషయికం అంటే విషయ సంబంధం. ఉదా: మోక్షమందు ఇచ్ఛ ఉంది.
అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం. ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.
ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్థం. ఉదా: ఘటంబున జలం ఉంది.

సంబోధనా ప్రథమా విభక్తి:

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.

ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది. ఉదా: ఓ రాముడ - ఓ రాములార
ఓ శబ్దానికి పురుషుని సంబోధించేటప్పుడు 'యి' అనేది, నీచ పురుషుని సంబోధించినప్పుడు 'రి' అనేది, నీచస్త్రీని సంబోధించినప్పుడు 'సి' అనేది అంతాగమాలుగా విభాషగా వస్తాయి. ఉదా: ఓయి రాముడా! ఓరి దుష్టుడా! ఓసి దుష్టురాలా!







తెలుగు వాక్యము

విషయమును అర్థవంతముగాను, సంపూర్ణము గాను స్పష్టముగాను భావప్రకటనమును కలిగించెడి పదముల సముదాయమును వాక్యము అంటారు. వాక్యములో మూడు ప్రధానమైన భాగములు ఉండును.

హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారము నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహాకావ్యాలు చెబుతాయి.

భాగాలు:


  • కర్త : ఒక పనిని చేయువారు.
  • కర్మ: ఆ పని యొక్క ఫలితములను అనుభవించునది.
  • క్రియ: పనిని తెలియజేయు పదము.

రకాలు:


  • సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అంటారు. ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.
  • అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అంటారు. ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,
  • అవాంతర వాక్యము: ఒక సంపూర్ణము కాని వాక్యమును, ప్రసంగమున మధ్యలో వచ్చెడి వాక్యమును అవాంతర వాక్యము అంటారు. ఉదా: తగిన ఇంధనము లేనిచో విమానము ఎగురలేదు.
  • సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్ధము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు. ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.
  • కర్తరి వాక్యం : కర్మణి వాక్యం: కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణి వాక్యాలు. ఉదా: రాముడు రాక్షసులను సంహరించాడు - కర్తరి వాక్యం; రామునిచే రాక్షసులు సంహరింపబడిరి - కర్మణి వాక్యం. కర్మణి ప్రయోగం అనేది తెలుగు భాషలో సహజంగా లేదు. ఇది ఇతర భాషల నుండి తెలుగు లోనికి వచ్చింది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది.
  • ప్రశ్నార్థక వాక్యాలు: సమాధానాన్ని ఆశించి అడిగేది ప్రశ్న. అలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదా: రాణి పాఠాలు చదువుచున్నదా ? ఏమిటి, ఎందుకు, ఎలాగ, ఎవరు, ఎక్కడ, ఏది మొదలైనవి ప్రశ్నలకు మూలాలైన ప్రశ్నార్థక పదాలు.
కథనం:

ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నదున్నట్లు చెప్పటం ప్రత్యక్ష కథనం. వేరేవాళ్లు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కథనం. ఈ రెండూ అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరికి "అని" అనేదాన్ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు.

ఇతరులు చెప్పిన దాన్ని, లేక తాను చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ప్రత్యక్షానుకృతి. ఉదా: నేను నీతో "నేను రాను" అని చెప్పాను

అనుకరించిన దానిలోని విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం పరోక్షానుకృతి. ఉదా: నేను నీతో రానని చెప్పాను.

తెలుగు అక్షరాలు

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, గ్గ్ట్ పొల్లు, నిండు సున్న, వెరసి 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

అచ్చులు


  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను   హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు     -  రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు.   ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు    -  ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును.ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.


హల్లులు 

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.



  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.

క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ

చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ

ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ

త వర్గము - త, థ, ద, ధ, న

ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

  • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
           సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
           సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు

  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

గుణింతాలు

తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు.

అచ్చులుఆకారము( లేక ) గుర్తునామములుగుణింతముచదువుట నేర్చుకొనుట
అకారముక్+అ=కకకార అకరముల క
ఆకారముక్+ఆ=కాకకార ఆకరముల కా
ిఇకారముక్+ఇ=కికకార ఇకరముల కి
ఈకారముక్+ఈ=కీకకార ఈకరముల కీ
ఉకారముక్+ఉ=కుకకార ఉకరముల కు
ఊకారముక్+ఊ=కూకకార ఊకరముల కూ
ఋకారముక్+ఋ=కృకకార ఋకరముల కృ
ౠకారముక్+ౠ=కౄకకార ౠకరముల కౄ
ఎకారముక్+ఎ=కెకకార ఎకరముల కె
ఏకారముక్+ఏ=కేకకార ఏకరముల కే
ఐకారముక్+ఐ=కైకకార ఐకరముల కై
ఒకారముక్+ఒ=కొకకార ఒకరముల కొ
ఓకారముక్+ఓ=కోకకార ఓకరముల కో
ఔకారముక్+ఔ=కౌకకార ఔకరముల కౌ
అంపూర్ణానుస్వారముక్+ం=కంకకార పూర్ణానుస్వారము కం
అఃవిసర్గక్+ః=కఃకకార విసర్గ కః
గుణింతము
అచ్చులుఅంఅః
అకారముల
గుర్తు
ి
అకారముల
ఉచ్చారణ
అ కారముఆ కారముఇ కారముఈ కారముఉ కారముఊ కారముఋ కారముౠ కారముఎ కారముఏ కారముఐ కారముఒ కారముఓ కారముఔ కారముపూర్ణాను స్వారమువిసర్గం

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
  • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
  • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
  • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
  • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
  • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
  • య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

 కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.




తెలుగు వ్యాకరణము

తెలుగు వ్యాకరణముపై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 16వశతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణమును బాలవ్యాకరణము అనే పేరుతో రాశారు. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యము లేక అపభ్రంశము కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.


 1 . తెలుగు అక్షరాలు
 2 . తెలుగు పదాలు
 3 . తెలుగు వాక్యాలు
 4 . విభక్తి
 5 . వచనములు
 6 . సంధి
 7 . సమాసము
 8 . ఛందస్సు
 9 . అలంకారాలు
 10 . ప్రకృతి - వికృతి
 11 . భాషాభాగాలు





Wednesday, November 14, 2018

తాళ్ళపాక అన్నమాచార్యులు

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందాఅంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.

"అన్నమాచార్య చరితము" ఆధారంగా

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.

నందవరీకుల గాధ

నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
అన్నమయ్య వంశీకులు

భారద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్హును.

భరద్వాజ ఋషి -> నారాయణయ్య -> విఠలయ్య -> నారాయణయ్య -> విఠలుడు -> నారాయణుడు -> నారాయణసూరి -> అన్నమాచార్య
అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య

కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.

నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.

నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి - నారాయణసూరి

అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.
అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం

భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
అన్నమయ్య జననం

ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట.[1] అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు.సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.

"అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.

శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్గ్యుల విశ్వాసం.
అన్నమయ్య బాల్యం


"హరి నందకాంశజుం డగుట డెందమున
పరమ సుగ్యాన సంపద పొదలంగ........."

అన్నమయ్య బొసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు.ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.

అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు. అన్నమయ్యకు -


అహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్య లన్నియును
నమితంబు లగుచు జిహ్వరంగసీమ
తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె

అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే ! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పస్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంతాగ్రహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడెవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పిన్చవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా" అని పిలిచేవాడు.

బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు సిరినవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెఋవు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర ఫడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకెం తెలీదు పోమ్మ"ని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరిపడిపోయే వాళ్లు.

నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్ధం లేనివి కావు ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనె ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగ అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "అప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకొవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు? "అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్." ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగ చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.

అన్నమయ్యకు అడవికి వెళ్ళదం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లెచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది.


’పాపవల్లరుల శ్రీపతినామహేతి
నే పార దఋగు యోగీంద్రు చందమున ’

అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీ హరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా !!" అని కేక పెట్టాడు, చిటికిన వేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి,భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘ్హటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పనిలేదనుకున్నాడు.


"అయ్యోపోయ బ్రాయముగాలము
మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||

తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును
వగలబెట్టుచు దిరుగువారేకాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
దగిలించలేక చింతాపరుడనైతి ||

అని చింతించి......


"తల్లియుదండ్రియు దైవంబు గురువు
నెల్ల సంపదలునై యెల్ల చందముల
ననుబ్రోచు శెశాద్రినాధుని,గొలిచి
మనియెద........."

అని నిర్ణయించుకొంటాడు.

తిరుమల పయనం


అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు, సనకాదులనే భక్తబృందం. వాళ్ల వేశం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో "గోవిందా! గోవింద!"........


"వేడ్కుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని||
ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు
తోమని పళ్యలవాడే దురితదూరుడే ||
......."

అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య.

తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్తబ్రుందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మేనెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది.


గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య -
"అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
లందు వెలుగొంది ప్రభమీరగాను "

అని ౧౦౮ తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గృహాలు, విశ్రాంతదేశాలను సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు.

ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ, మోకాళ్ళముడుపులను గూర్చి వివరించడం సమంజసం.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

తిరుమల దర్శనం

ఒకనాడు (8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.[2] అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకమురచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.

తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

అన్నమయ్య చిత్రపటం

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.
అళిపురిసింగరి(అలిపిరి)

కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం.
సంసారం, సంకీర్తనం

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.
రాజాశ్రయం

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.
అంత్య కాలం

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.

ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.
అన్నమయ్య కీర్తనలు, రచనలు
అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు. ఐ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
ఉదాహరణలు


"అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము॥

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥

కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము॥

"

మరిన్ని ఉదాహరణాలకై క్రింద లింక్ ని చుడండి.

https://te.wikisource.org/wiki/అన్నమయ్య_పాటలు_అ

కవి కుటుంబం


అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.


తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.


చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.


ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...